ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై అల్లూరి జిల్లా జేఏసీ హర్షం
పాడేరురూరల్, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి):
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు జేఏసీ జిల్లా చైర్మన్ ఎల్.రవీంద్ర పాత్రుడు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం స్థానిక ఎన్జీవో భవనంలో నిర్వహించిన ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎ.విద్యాసాగర్ నాయకత్వంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలితంగానే ఉద్యోగుల సమస్యలు పరిష్కార దిశగా అడుగుల పడ్డాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 12వ పీఆర్సీ ఏర్పాటుకు అంగీకరించడం, పెండింగ్ డీఏల చెల్లింపు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల, పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలను అక్టోబరు 1వ తేదీ నుంచి నగదు రూపంలో చెల్లించేందుకు, మిగిలిన డీఏలను విడతల వారీగా విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించడం ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయమన్నారు. జీపీఎఫ్, గ్రాట్యూటీ, ఈఎల్ ఎన్క్యాష్మెంట్, వైద్య బిల్లు తదితర పెండింగ్ ఆర్థిక బకాయిలను దశలవారీగా విడుదల చేయడానికి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెన్షనర్ల సమస్యలు తదితర అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూల దోరణితో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర, జిల్లా నాయకులు ఎల్.బొంజన్న, జి.సింహాద్రి, ఎస్.సంజీవరాజు, కె.కాంతారావు, ఆర్.నాగభూషణం, పి.సింహాచలం, కె.సురేష్, ఎం.సూర్యనారాయణ నాయుడు, ఎ.శ్యామ్సుందర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 08 , 2026 | 12:54 AM
(0)Comments