స్టేషన్ ఘనపూర్ (తెలుగు ప్రభ): తెలంగాణ శాసనసభ సమావేశాల్లో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్యానల్ స్పీకర్గా సభాధ్యక్ష స్థానంలో ఆసీనులై సభను నడిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సభా వ్యవహారాలను తన సుదీర్ఘ రాజకీయ, పార్లమెంటరీ అనుభవంతో సమర్థవంతంగా నిర్వహించారు. ప్యానల్ స్పీకర్ హోదాలో స్పీకర్ స్థానంలో కూర్చున్న కడియం శ్రీహరి.. సభా నియమావళిని పాటిస్తూ అధికార,ప్రతిపక్ష సభ్యులకు తగిన సమయం కల్పించారు.వివిధ ప్రజా సమస్యలపై జరిగిన చర్చలను క్రమబద్ధంగా కొనసాగిస్తూ సభను గౌరవప్రదంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బీఆర్ఎస్ నాయకులు తాత మధు, నవీన్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తనకు బాధ్యత వహిస్తూ కేసీఆర్ క్షమాపణ చెప్పాలని తీర్మానంలో పేర్కొన్నారు.మాజీ మంత్రిగా,ఉప ముఖ్యమంత్రిగా,ఎంపీగా పనిచేసిన కడియం శ్రీహరికి ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం సభ నిర్వహణలో స్పష్టంగా కనిపించింది. సభాధ్యక్ష స్థానంలో ఆయన వ్యవహరించిన తీరు, సభా నియమాలపై ఉన్న పట్టు,సభ్యుల పట్ల చూపిన సమన్వయ ధోరణి పలువురి ప్రశంసలు అందుకుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరిని ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు.
(0)Comments