దేశంలో మత్స్య రంగంలో మరో కీలక ఆవిష్కరణ జరిగింది. కేరళలోని కొచ్చిలో ఉన్న సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (cmfri) ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన 'మత్స
దేశంలో మత్స్య రంగంలో మరో కీలక ఆవిష్కరణ జరిగింది. కేరళలోని కొచ్చిలో ఉన్న సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CMFRI) ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన 'మత్స్యమేట్రి' అనే మొబైల్ యాప్ సముద్రపు చేపలను తాకకుండా వాటి పొడవు, వెడల్పులను కచ్చితంగా కొలవడానికి సహాయపడుతుంది. ఈ యాప్ సముద్ర మత్స్య రంగంలో శాస్త్రీయ పరిశోధన, డేటా సేకరణలో ఒక పెద్ద ముందడుగు అవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ యాప్ను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఐసీఏర్ నేషనల్ ఫెలో ప్రాజెక్ట్లో భాగంగా రూపొందించారు. ఈ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఈ యాప్ను అభివృద్ధి చేసిన డాక్టర్ ఎల్డో వర్గీస్, CMFRIలో సీనియర్ సైంటిస్ట్, సముద్రంలోని చేపల నిల్వలను కచ్చితంగా కొలవడం, సముద్ర పరిశోధన కోసం డేటా సేకరణను మరింత సమర్థవంతంగా చేయడమే లక్ష్యంగా ఈ యాప్ను రూపొందించారు. గతంలో క్షేత్రస్థాయిలో చేపలను కొలవడానికి త్రాసులను ఉపయోగించాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త యాప్తో చేపల కొలతలు తీసుకోవడం మరింత సులభం అవుతుంది. యాప్ను ఓపెన్ చేసి, స్మార్ట్ఫోన్ కెమెరాను చేప వైపు పట్టిస్తే సరిపోతుంది. వెంటనే చేప కొలతలు తెలిసిపోతాయి. ఈ యాప్ ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీని ఉపయోగించి పనిచేస్తుంది, ఇది ఏఆర్ కోర్ సపోర్ట్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులో ఉంటుంది.
ఈ యాప్ ఎలా పనిచేస్తుందంటే, ఫోన్ కెమెరాను చేప వైపు ఉంచినప్పుడు స్క్రీన్పై ప్రత్యేక కొలత గైడ్ కనిపిస్తుంది. దాన్ని ఉపయోగించి చేప పొడవు, వెడల్పులను కచ్చితంగా కొలవవచ్చు. ఒకే జాతికి చెందిన అనేక చేపల కొలతలను ఒకే నమూనా సేకరణ సమయంలో యాప్లో నమోదు చేయవచ్చు. ఈ విధంగా సేకరించిన సమాచారం యాప్ ద్వారా ఆటోమేటిక్గా వేరు అయిపోతుంది. ఈ డేటా భవిష్యత్తు శాస్త్రీయ అధ్యయనాల కోసం డిజిటల్గా స్టోర్ అవుతుంది. చేపల పరిమాణం, వయసు మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి, వాటి పెరుగుదలను లెక్కించడానికి ఈ సమాచారం శాస్త్రవేత్తలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా, రద్దీగా ఉండే ఫిషింగ్ పోర్టులు, ల్యాండింగ్ కేంద్రాల వద్ద చేపలను నేరుగా కొలవడంలో ఎదురయ్యే ఆచరణాత్మక ఇబ్బందులకు ఈ కొత్త యాప్ శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది.
సంప్రదాయ తూకం పద్ధతుల వల్ల వృథా అయ్యే సమయాన్ని తగ్గించడానికి, అలాగే సేకరించిన డేటా కచ్చితత్వాన్ని నిర్ధరించడానికి ఈ యాప్ సహాయపడుతుందని CMFRI డైరెక్టర్ డాక్టర్ గ్రీన్సన్ జార్జ్ తెలిపారు. సముద్ర చేపల పరిరక్షణ, వనరుల నిర్వహణకు అవసరమైన విధాన రూపకల్పన కోసం భవిష్యత్తులో ఈ యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సముద్ర మత్స్య రంగంలో చేపల సుస్థిర మనుగడను నిర్ధరించడానికి ఇటువంటి డిజిటల్ వ్యవస్థలు చాలా అవసరమని ఆయన చెప్పారు. దేశంలో సముద్ర చేపల పరిశోధన చరిత్రలో ఈ యాప్ ఒక గొప్ప ఆవిష్కరణగా నిలిచిపోతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇటీవల, బిహార్లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ కూడా చేపలకు వచ్చే వ్యాధులను ముందుగానే గుర్తించి, సకాలంలో చికిత్స అందించడానికి ప్రత్యేకమైన యాప్ను అభివృద్ధి చేసింది. ఈ యాప్కు NSPDT అని పేరు పెట్టారు. ఈ యాప్ చేపల పెంపకందారులకు చాలా ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా చేపలకు సోకే వ్యాధులను ముందుగానే గుర్తించి, సరైన నివారణ చర్యలను చేపట్టవచ్చు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ చేపట్టిన ఈ చొరవ నీలి విప్లవానికి నాందిగా నిలిచింది.
08 Sept, 2026
08 Sept, 2026
(0)Comments