జీవీఎంసీ వార్డులను 98 నుంచి 120కి పెంచేందుకు కసరత్తును అధికారులు వేగవంతంగా చేపడుతున్నారు. అయితే డీలిమిటేషన్ అంటే ఉన్న వార్డులను తమకు నచ్చినట్లుగా విభజిస్తూ రాజకీయ అవకాశాలను కూటమి అందుకునేలా అధికారులు చేస్తే ఊరుకునేది లేదని వైసీపీ హెచ్చరిస్తోంది.
వైసీపీకి బలం ఉన్న వార్డులను రెండుగా ముక్కలు కొట్టి డీలిమిటేషన్ చేయడం ద్వారా కూటమికి రాజకీయ లాభం జరుగుతుందని ఆ పార్టీ ఆందోళన చెందుతోంది. ఏది చేసినా శాస్త్రీయంగా జరగాలని కోరుతోంది.
అందుకే జీవీఎంసీలో వార్డుల డీలిమిటేషన్ను సంప్రదాయ పద్ధతిలో చేపట్టాలని, ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. వార్డుల పునర్విభజనలో ప్రజల సౌలభ్యం, పరిపాలనా అవసరాలు, స్థానిక సంప్రదాయాలను ప్రాతిపదికగా తీసుకోవాలని.. అయితే ఇలాంటివి ఏవీ పరిగణనలోకి తీసుకోకుండా అడ్డగోలుగా తమకు నచ్చినట్లుగా మార్పులు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
గతంలో ఎన్నికల నిర్వహణలో భాగంగా వార్డుల సంఖ్యను 120కి మార్చే ప్రక్రియ చేపట్టారని, దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహించారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పరిపాలన సులభంగా జరిగేలా అన్ని నిబంధనలు, ప్రమాణాలను పాటిస్తూ డీలిమిటేషన్ చేయాలని ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారని చెప్పారు. అయితే కోర్టులో డీలిమిటేషన్కు సంబంధించిన అంశాలు పెండింగ్లో ఉన్న సమయంలోనే జీవీఎంసీ అధికారులు అత్యుత్సాహంతో మ్యాపింగ్లో మార్పులు, చేర్పులు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ప్రస్తుత డీలిమిటేషన్లో ప్రజల సౌలభ్యం కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. కులాలు, రాజకీయ పార్టీల ప్రాతిపదికన వార్డులను విభజించడం వల్ల భవిష్యత్తులో ప్రజల మధ్య విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.
ఒకే గ్రామం లేదా ఒకే ప్రాంతానికి చెందిన ప్రజలను విభజించి వేర్వేరు వార్డుల్లో చేర్చడం, అదే విధంగా గ్రామంతో అనుబంధం ఉన్న దేవాలయాలు, గ్రామ సంఘాలు, స్థానిక సంస్థలను వేరే వార్డుల్లో కలపడం సరైన విధానం కాదన్నారు.
డీలిమిటేషన్కు సంబంధించిన అంశాలు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు తుది తీర్పు వచ్చే వరకు అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కేకే రాజు అన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం సరికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు, ఎన్నికల సంబంధిత చట్టాలు, జీవోలకు అనుగుణంగానే డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలని డిమాండ్ చేశారు. #ट्रेंडिंग हैशटैग: tdpvishakaysrcp
(0)Comments