కలెక్టర్కు సమస్య వివరిస్తున్న ఏనేటికొండ గిరిజనులు
20 ఏళ్లుగా కులధ్రువీకరణ పత్రాల్లేవ్
పిల్లల భవిష్యత్ నాశనమైపోతోంది
ఏనేటికొండ గిరిజనుల ఆవేదన
జడ్పీ వద్ద మండే ఎండలో నిరసన
ఆదుకోవాలని కలెక్టర్కు వేడుకోలు
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): 'మాకు గత ఇరవై సంవత్సరాలుగా కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా పిల్లల బతుకులు సర్వనాశనమైపోతున్నాయి. మేము బతికేదెలా' అని ఎస్టీ ఏనేటికొండ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని సారవకోట, పాతపట్నం, కోటబొమ్మాళి, జలుమూరు, టెక్కలి మండలాల్లో సుమారు 5వేల మంది ఎస్సీ ఏనేటికొండ గిరిజనులు నివసిస్తున్నారు. కాగా.. 20 ఏళ్లుగా కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరుకాక వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీకాకుళం జడ్పీలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'మీ-కోసం' కార్యక్రమానికి సుమారు 300 గిరిజనులు తరలివచ్చారు. విద్యార్థులు, వృద్ధులు సైతం ఎండలో నిల్చొని నిరసన తెలిపారు. కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని, తమ గోడును పట్టించుకోవాలని అధికారులను వేడుకున్నారు. తమ ఆవేదన వినేవరకూ ఇక్కడ నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. దీంతో స్వయంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వారి వద్దకు వచ్చి సమస్యలను సావధానంగా విన్నారు. 'మా తాతలు, తండ్రుల కాలం నుంచి కుల ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం జారీచేసింది. అదే కుటుంబాలకు చెందిన వారసులమైన మాకు 20 ఏళ్లుగా కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడం లేదు. అధికారులు హేళనగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. కుల ధ్రువీకరణపత్రాలు లేక మా పిల్లలు చదువుకు దూరమై.. బాల కార్మికులుగా మారిపోతున్నార'ని కలెక్టర్ ముందు వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు జారీచేసి ఆదుకోవాలని కోరారు. దీనిపై పరిశీలించి సమస్య పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారంతా వెనుదిరిగారు.
Updated Date - Sep 08 , 2026 | 12:23 AM
Tags
(0)Comments