Mridula on Pawan Birthday : అభిమానం ఆమెను కొండలు ఎక్కించింది. గుట్టలు దాటించింది! నిశీధిలో నడిపించింది. ఆ మహిళ ఎవరో కాదు నెల్లూరుకు చెందిన జనసేన వీర మహిళ చదలవాడ మృదుల! ఈ నెల 2న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయనపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు ఆమె. కొండకోనలు దాటుతూ గిరిజనులకు నిత్యావసర వస్తువులతోపాటు ప్రేమాభిమానాలను పంచారు. నెల్లూరు నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా వరకూ సాగిన ఆ జర్నీ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
రంపచోడవరం మండలం ఏరువాడ తులసిపాక నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఏరువాడ అనే గిరిజన గ్రామం ఉంది. చూట్టూ అడవి, కొండ ప్రాంతం. వాహనాల బాట ఉండదు. ఏరులు, వాగులు దాటుకుంటూ కాలినడకన అక్కడికి చేరుకోవాలి. ఈ గ్రామంలో 30 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. పవన్ కల్యాణ్ జన్మదినం అనగా (సెప్టెంబర్ 2న) జనసేన వీర మహిళ మృదుల కొండలు, గుట్టలు దాటి ఏరువాడ చేరుకుంది.
Pawan Kalyan Birthday : ఈ సందర్భంగా గిరిజనులకు కావలసిన నిత్యావసర వస్తువులు, కూరగాయల విత్తనాలు, మందుల కిట్లు, తదితర వస్తువులను మృదుల పంపిణీ చేశారు. ఆ గిరిజన ప్రజల గుండెల్లో పవన్ కల్యాణ్ మీద ఉన్న ప్రేమను, ఆప్యాయతను ఆమె స్వయంగా వీక్షించారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆమెను కోరారు. దీనిపై స్పందించిన మృదుల ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు.
ఈ విషయంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఏరువాడ గిరిజన గ్రామానికి రహదారి వరమిచ్చారు. ఈనెల 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన వీరమహిళ మృదుల ఏరువాడ వెళ్లి గిరిజనులకు నిత్యావసరాలు అందించారు. రహదారి లేకపోవడం వల్ల కొండకోనలు దాటుతూ ఏరువాడ వెళ్లేందుకు ఆమె ఎదుర్కొన్న కష్టాలను పవన్ వీడియో ద్వారా తెలుసుకుని అడవితల్లి బాట కింద రూ.10 కోట్లతో రోడ్డు మంజూరు చేశారు.
Pawan on Yeruvada Village : ఈ రోడ్డుకు ప్రాధాన్యం ఇచ్చి వెంటనే తగిన అనుమతులివ్వాలని పవన్ కల్యాణ్ ఆదేశించినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. రహదారి నిర్మాణం పూర్తవగానే గిరిజన ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకూ భరోసానిచ్చారు. ఇదే సమయంలో ఏరువాడకు తాగునీటి సదుపాయం సైతం కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు.
పవన్ కల్యాణ్కు అడ్వాన్స్ బర్త్డే విషెస్ - 'ఏ తల్లి కన్నదో నిన్ను ఓ పవనన్నా' సాంగ్ రిలీజ్
పాఠశాల కొత్త భవనం నిర్మించిన పవన్ - బర్త్డే వేడుకలు జరిపిన విద్యార్థులు
(0)Comments