సంగారెడ్డి (తెలుగు ప్రభ): రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రి గా చేయడమే ఏకైక లక్ష్యం గా ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని సంగారెడ్డి డిసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సంగారెడ్డి పట్టణం లో జరిగిన ఆదివాసి కాంగ్రెస్ జిల్లా కమిటీ ఎన్నికకోసం ఏర్పాటుచేసిన సంఘటన్ సృజన్ కార్యక్రమం లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకముందునుండి దేశ ప్రజలకు సేవ చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. స్వర్గీయ ఇందిరాగాంధీ ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు నిచ్చారని గుర్తు చేశారు.
కార్యక్రమానికి హాజరైన ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ చైర్మన్ లింగం నాయక్ మాట్లాడుతూ ఆదివాసీలు, యానాదిలు, చెంచులు మొదటినుండి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతీ గిరిజనుడి కి గుర్తింపు ఇచ్చేందుకు సంఘటన్ సృజన్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు జిల్లా కమిటీ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్,జిల్లా అధ్యక్షుడు రామ్ చందర్ నాయక్, ఇంచార్జ్ కిషన్ నాయక్,బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జార్జ్, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
(0)Comments