కోల్సిటీ, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాల నుంచి ప్రజలను రక్షించడంలో సైబర్ వారియర్స్ పాత్ర కీలకమని, నేరాలు జరిగినప్పుడు వారియర్స్ వెంటనే స్పందించేలా నైపుణ్యాలను పెంచుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. సోమవారం కమిషనరేట్లో సైబర్ నేరాలపై సైబర్ వారియర్స్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సైబర్ వారియర్స్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సైబర్ నేరాల స్వభావం, నేరస్థుల కార్యకలాపాలు, ముఠాలపై నిఘాలు పెట్టాలని, సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలన్నారు. నిందితులు, బాధితుల అకౌంట్ల వివరాలు, లింకులు రికార్డు చేయాలని ఆదేశించారు. కోర్టు అధికారులు, బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకుని ఆర్డర్లు వచ్చేలా కృషి చేయాలన్నారు. ప్రతి గణపతి మండపంలో టీజీసీఎస్బీ విడుదల చేసిన పోస్టర్లను ప్రదర్శించాలని పోస్టర్లను ఆవిష్కరించారు. టీజీసీఎస్బీ ఎస్బీ సాయిశ్రీ, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ వెంకట రంగారెడ్డి, సీఐ రాణాప్రతాప్, శ్రీనివాస్, మారుతి, క్రాంతి, సీసీ సందీప్ పాల్గొన్నారు.
Updated Date - Sep 08 , 2026 | 12:26 AM
(0)Comments